తాళ పత్ర గ్రంధాలు అంటే తాటాకులమీద రాసిన గ్రంధాలు అని చాలామంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. అవి తాటాకులమీద రాసిన గ్రంధాలు కాదు. వాటికోసం ఉపయోగించిన ఆకులు శ్రీతాళం అనే చెట్టునుంచి కోసిన ఆకులు. అవే వేల సంవత్సరాలుగా గ్రంధాలుగా , ప్రాచీన విజ్ఞాన నిధులుగా మిగిలిపోయాయి. ప్రాచీన కాలంలో మానవులు తమ భావాలు, ఆలోచనలను రాళ్లపై గుర్తులు, బొమ్మల రూపంలో వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత భాషతో పాటు లిపిని కనిపెట్టారు. ఆ జ్ఞానాన్ని తాళపత్ర గ్రంధాల రూపంలో ముందు తరాలకు అందించారు.
సాహిత్యం, కళలు ,సంస్కృతి, సాంప్రదాయాలు, కావ్యాలు, పురాణాలు ,చరిత్రలను తాళపత్ర గ్రంధాలపై ఘంటాలతో రాసేవారు. రామాయణం, మహాభారతాలు కూడా ఘంటంతో తాళపత్ర గ్రంధాలపై రాసినవే. సున్నితమైన మొన కలిగిన ఘంటం తో ఆకులపై రాసేవారు. ఆకుపై ఘంటం తో రాసిన అక్షరాలు సరిగ్గా కనిపించేవి కావు. దీంతో ఆ అక్షరాలపై ప్రత్యేకంగా తయారు చేసిన బూడిదను పూసేవారు. రాత పరికరాల్లో సాంకేతికత పెరగడంతో తెల్ల కాగితాలపై ఇంకు రాతలు వచ్చాయి.
తొలుత ఇంకులో పాళిని ముంచి రాసేవారు. ఈ కలాలతో మాటి మాటికీ సిరాలో ముంచి రాయవలసి వచ్చేది. దీంతో చాలా సమయం పట్టేది. ఈ పరిస్థితుల్లో లూయిస్ ఎడసన్ వాటర్ మన్ అనే వ్యక్తి ఫౌంటెన్ పెన్ను కనిపెట్టాడు. ఆ తర్వాత బాల్ పెన్నులు వాడుకలోకి వచ్చాయి. దీన్ని బాల్ పాయింట్ పెన్ అని కూడా పిలుస్తారు. బాల్ పెన్ను లలో ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఫౌంటెన్ పెన్నులను ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. దాదాపు అందరూ బాల్ పెన్నులను ఉపయోగిస్తున్నారు.

