అంతరిక్ష యాత్రలంటే అవేవో ఆకాశానికి విహారయాత్రలు కాదు. భావితరాలకు ఒక ప్రయోజనాన్ని చేకూర్చే ప్రయోగాలు . రాబోయే తరాలకు నూతన ఆవిష్కరణలను అందించే గొప్ప యాత్రలు. అంతరిక్ష కేంద్రానికి పోయిన నలుగురు వ్యోమగాముల్లో భారతీయుడు శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయోగశాలలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేసి విజయం సాధించాడు. అంతరిక్షంలో జీరో గ్రావిటీలో అంటే భూమి ఆకర్షణ శక్తి పూర్తిగా లేని ప్రాంతంలో అక్కడ మెంతులు పప్పు మొలకలు పెంచి భూమ్మీదకి తీసుకొస్తున్నాడు. అంటే అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పెసరపప్పు , మెంతి ఈ రెండు విత్తనాలను వేసి అంకురం వచ్చిన తర్వాత అంకురాన్ని ఒక పెట్టెలో పెట్టి మరి కొద్ది రోజుల్లో భూమికి తీసుకొస్తున్నాడు.
పదో తేదీ తర్వాత అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైన వారి వ్యోమ నౌక ఫ్లోరిడా సముద్ర తీరంలో వాతావరణ పరిస్థితులను బట్టి భూమికి తిరిగి రానుంది . వచ్చిన తర్వాత అంతరిక్ష ప్రయోగశాలలో పెంచిన పెసరపప్పు, మెంతి అంకురాలను భూమి మీద ప్రయోగశాలలో అభివృద్ధి చేసి జీరో గ్రావిటీలో వాటి పెరుగుదల, వాటి జీన్స్ ఇలా అన్నిటిని కూడా అధ్యయనం చేస్తారు . దీన్ని బట్టి రాబోయే కాలంలో అంతరిక్షాన్ని వ్యవసాయ పరిశోధనలకు కేంద్రంగా కూడా చేయబోతున్నారు. అక్కడే నాచుని కూడా అభివృద్ధి చేశారు . ఈ నాచు భవిష్యత్తులో అంతరిక్షంలో బయో ఇంధన అంటే జీవ ఇంధన తయారీ కూడా ఉపయోగించే అవకాశాలు మెండుగా ఉంటాయి.
జీరో గ్రావిటీలో పెరిగిన అంకురం భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో అంటే భూమ్యాకర్షణ శక్తి ఉన్నచోట ఎలా పెరుగుతాయి..? వాటిలో జరిగే మార్పులు వీటన్నిటిని కూడా అధ్యాయనం చేస్తారు . ఇదే కాకుండా మూల కణాల చికిత్సపై కూడా అంతరిక్షంలో ప్రయోగాలు చేసి చూస్తున్నారు . ఇలా అంతరిక్ష ప్రయోగశాలలో మనకు తెలియని ఎన్నో అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి. సామాన్యులు మామూలుగా అయితే అంతరిక్ష కేంద్రానికి ఆకాశ విహారానికి పోయి వస్తుంటారు అన్న భ్రమ ,అపోహ కొంతమందిలో ఉంటుంది . కానీ అది నిజం కాదు . వ్యోమగాములు తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి అక్కడ పరిశోధన చేసి తిరిగి భూమి మీదకు వస్తున్నారు .

