బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతుందని పేర్కొంది. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని.. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో భారీగా ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా హోం మంత్రి అనిత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. 112, 1070, 18004250101 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచనలు చేశారు.

