పాఠశాలల్లో భద్రతను మరింతగా బలోపేతం చేసేందుకు సీబీఎస్ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లో హై రిజల్యూషన్తో కూడిన సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు గత నిబంధనను సవరిస్తూ తన పరిధిలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా లేఖ రాశారు. దీని ప్రకారం.. అన్ని పాఠశాలల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, లాబీలు, కారిడార్లు, మెట్లు, తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీ, క్యాంటీన్ ప్రాంతం, స్టోర్ రూమ్, ఆట స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు.
గోప్యతను దృష్టిలో ఉంచుకొని టాయిలెట్లు, వాష్రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు మినహాయింపు కల్పించినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ సీసీటీవీ కెమెరాలు హై రిజల్యూషన్తో ఆడియో విజువల్ సౌకర్యంతో ఉండాలని సూచించారు. రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్తో కనీసం 15 రోజుల ఫుటేజీని నిల్వ చేయగల సామర్థ్యంతో కూడినవిగా ఉండాలని పేర్కొన్నారు. అవసరమైన సంబంధిత అధికారులు 15 రోజుల బ్యాకప్ని యాక్సెస్ చేయగలిగేలా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతతో పాటు సర్వైలెన్స్ మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

